Warning: file_exists(): open_basedir restriction in effect. File(/var/www/html/inc/config.php) is not within the allowed path(s): (/home/ekaucom:/tmp:/var/cpanel/php/sessions) in /home/ekaucom/domains/warmtribute.com/inc/subconfig/paths.php on line 5

Warning: file_exists(): open_basedir restriction in effect. File(/var/www/html/inc/config.php) is not within the allowed path(s): (/home/ekaucom:/tmp:/var/cpanel/php/sessions) in /home/ekaucom/domains/warmtribute.com/inc/subconfig/database.php on line 6
గుంటూరు శేషేంద్ర శర్మను మళ్ళీ తెల - Note to KavirviswoMahaaTejaa Gunturu Seshendra Sh | Warm Tribute for a Loved One Online Memorial | Immortalize Your Loved One
home about create a tribute online tributes the blog articles contact log in
September

10

2026
Share |

గుంటూరు శేషేంద్ర శర్మను మళ్ళీ తెల

A Note to KavirviswoMahaaTejaa Gunturu Seshendra Sh by Saatyaki S/o Seshendra Sharma

 

గుంటూరు శేషేంద్ర శర్మను

మళ్ళీ తెలుసుకుందాం

మే 30, 2010

 శేషేంద్ర మూడవ వర్ధంతి స్మారకోపన్యాసం

%7B6C0278EC-4D56-4581-AEAF-F15CAAAD139C%7D.tmpk1.jpeg- డా. కాత్యాయనీ విద్మహే

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B9%E0%B1%87

 

 

గయలో గాశి ప్రయాగ శ్రీగిరిని గంగాద్వార నీలాచలో

 జ్జయినీ ద్వారకలందయోధ్య మధురన్ సంస్తుత్య పుణ్యస్థలా

గ్రియతన్ వెండియు మించు నైమిశ కురుక్షేత్రాదులం దర్పణ

 క్రియచే నా పితనమ్ముఁడెఱ్ఱన యొనర్చెన్ దండ్రికాహ్లాదమున్.

* * *

ఏనుంబితృపూజన నా

చే నైనట్లెద్దిఁయైనఁ జేయఁగవలయున్

 గానఁ, గృతి యిచ్చిమేదిని

పై నిలుపుదు నతని కీర్తి Cబరమేశుకృపన్||

(ప్రభావతీప్రద్యుమ్నం, పద్యాలు 8,9)

 

 

అని నిశ్చయించుకొని సూరన తన రచనను తండ్రికి అంకితమిచ్చాడు. పితృపూజ తర్పణ క్రియారూపమే కానక్కరలేదు అన్న సూరన మార్గంలో సాత్యకి గారు ఎంచుకొన్న పితృపూజనమార్గం తండ్రి గారయిన గుంటూరు శేషేంద్ర శర్మగారి వర్థంతిని సాహిత్యసభగా నిర్వహించటం. నాకూ సాత్యకి గారికి సమానధర్మం అది. 1990లో మానాన్న కేతవరపు రామకోటిశాస్త్రి మరణించినప్పటి నుండి ప్రతియేడూ అక్టోబరు 28 ఆయన రచననొకదానిని అచ్చువేయటం, పుస్తక పరిచయ సభగా సంస్మరణ జరపటం నేను చేస్తున్నపని. అలాంటిపనే తన తండ్రిగారిపట్ల నిర్వహిస్తున్న సాత్యకి గారు ఈసారి సభలో శేషేంద్ర శర్మగారి గురించి మాట్లాడమని నన్నడిగితే ఒప్పుకొన్న ప్రథమకారణం అదే. రెండవ కారణం మా నాన్నా శేషేంద్రశర్మ గారూ మిత్రులు కావటం, మూడవ కారణం ఒక సాహిత్య విద్యార్థిగా శేషేంద్రశర్మ గారిని మొత్తంగా ఒకసారి చదవటానికి తెలుసు కోవటానికి అవకాశంగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొనాలనుకొనటం. ఆరకంగా సాత్యకిగారు, నేనూ ఒక సాహిత్య సంప్రదాయ వారసత్వంగా పింగళిసూరన మార్గంలో మాకు తెలియకుండానే ప్రారంభించిన నడకకు మామా తండ్రుల స్నేహవారసత్వం కూడా అదనపు విలువగా సమకూరిందనిభావిస్తున్నాను

నేను శేషేంద్రగారిని బి.ఎ. చదువుతున్నప్పుడు మొదటి సారి తెలుసుకొన్నాను. మాకప్పుడు ద్వితీయభాష తెలుగులో వచనసాహిత్య విభాగంలో శేషేంద్రశర్మగారి 'సాహిత్యకౌముది' పాఠ్యాంశం. శ్రీనాధుని పద్యశిల్ప సౌందర్యాన్ని నిరూపిస్తూ పద్యాలకు పద్యాలు ఉటంకిస్తూ శేషేంద్రగారు వ్రాసిన వ్యాసం ఆశ్చర్యకరంగా, ఆకర్షక కేంద్రంగా వుండింది. వ్యాసానికి వ్యాసం మాకప్పుడు ధారణలో వుండేది. నా బి.ఎ పూర్తయ్యేటప్పటికి మండే సూర్యుడు (1974) నాదేశం- నాప్రజలు కావ్యాలు వ్రాసి సాహిత్యరంగంలో గొప్ప చర్చకు కారణమైనాడు ఆయన. 1977లో ఎమ్మే అయిపోయాక కానీ నాకవి చదివే అవకాశంరాలేదు. నేను ప్రధానంగా వచనరచనా పాఠకురాలిని, శేషేంద్రగారు వ్రాసిన 'కామోత్సవ్' నవలను మాత్రం ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వస్తుండగానే ఆసక్తిగా చదివాను. ఈ వస్తువేమిటి? ఇలా వ్రాసారేమిటి? ఇందువల్ల ఆశించిన ప్రయోజనమేమిటి? అని కొంత ఆందోళన పడ్డమాట వాస్తవం. సాత్యకి గారే ఎక్కడో నవల శేషేంద్రగారు వ్రాసింది కాదని మరెవరిచేతనో వ్రాయించి శేషేంద్ర పేరున అచ్చేసిన నవల అని చెప్పారు. అలా ఎందుకు జరిగిందో మనకు తెలియదు. అయితే శేషేంద్ర మాత్రం ఆ నవల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భంలో కూడా అది తనది కాదనలేదు. పైగా అన్ని నీతులు, అన్ని చట్టాలు సాధారణ ప్రజలకేగాని ఉన్నతవర్గాలకి వర్తించవు. ఉన్నత వర్గాల్లో వున్న అస్తవ్యస్త సంబంధాలు, సాంఘిక, నైతిక బాధ్యత లేవీ ఆవర్గానికి లేకపోవటం, ఆవర్గాలే పాలకవర్గంగా వుండటం మొదలైన అంశాలను చిత్రించే ఏ ఉద్దేశంతో తానా నవల వ్రాశాడో దానిని తెలుగు సాహిత్య పాఠకులు అర్థం చేసుకోలేకపోయారని వాపోయారు. (సాహిత్యదర్శిని. పు 239) రచయిత చెప్పిన ఈ ఉద్దేశాన్ని ఆ రచన ఎంతవరకు ఆవిష్కరించగలిగిందో ఇప్పుడు మళ్ళీ ఆనవల చదివితే కానీ నిర్ధారించలేము. అదలా వుంచుదాం.

శేషేంద్ర శర్మను సాహిత్య ప్రపంచంలో స్థిరీకరించినవి ప్రధానంగా ఆయన కవిత్వం, విమర్శ. అయినా ఆయన వ్రాసిన కథలు, ఒకే ఒక నాటకం కూడా మనం ప్రస్తావించుకొనవలసినవే. కథలు ‘విహ్వల' అన్న సంపుటిగా 1968లో వచ్చింది. ఆ సంవత్సరమే 'మబ్బుల్లో దర్బార్' అనే నాటకం కూడా అచ్చయింది. 'విహ్వలతో కలుపుకొని శేషేంద్ర వ్రాసిన కథలు ఐదు. ఇతివృత్తాలు వేరైనా కధలన్నిటి అంతస్సూత్రం జీవితవిషాదం. చిన్న చిన్న సరదాలను సంతోషాలను కూడా పొందటానికి అవరోధమయ్యే పేదరికం, పేదరికంలోనైనా పెన్నిధి వలె వుండే కౌటుంబిక బాంధవ్యాలను సైతం దక్కనీయకుండా ఆత్మీయులను ప్రమాదపు అంచులకు నెట్టివేసే వృత్తి జీవన విధానాలు, యుద్ధాలు, ఇవన్నీ జీవితంలో దుఃఖానికి ఎలా కారణమవుతున్నాయో చెప్పే కథలు విహ్వల, రంగుల చేప, ఎగిరిపోయిన హంస. వీటిలో విహ్వల కథ పిల్లల మనస్తత్వంలోని స్వచ్ఛతను నిబిడ బంధంతో చిత్రించింది. ఆర్థిక అసమానతలకు అతీతంగా వికసించగల మానవీయ సంస్పందనను ఆవిష్కరించింది. స్త్రీల జీవితాన్ని దుఃఖ భాజనం చేసే పురుష పశు ప్రవృత్తి హరిణ కథాంశమైంది. వయో తార తమ్యాలతో నిమిత్తం లేకుండా జనించే ప్రేమకాలాంతరంలో జీవిత వాస్తవాలను కంటి ముందు నిలబెట్టినప్పుడు కల్లోలానికి లోనయ్యే అంతరంగాలను ఆవిష్కరించింది హిరణ్మయి కథ. మొత్తానికి శేషేంద్ర కథలు చదివించే లక్షణం కలవి. మనో వైచిత్రీ చిత్రణ ప్రధానమైనవి.

'మబ్బుల్లో దర్బారు' 1954లో వ్రాయబడి ఆంధ్రప్రభలో ||అచ్చయి 1968లో ప్రథమ ముద్రణ పొందిన నాటకం. అయినా ఆనాటకంలో చర్చించబడిన సమస్యలు ఇంకా  అపరిష్కృతంగానే ////సంకు అధికారకాంక్షకు అది ఒక వ్యాఖ్యానంగా, విమర్శగా వుండటం వలన ఈనాటి సమాజానికి, స్వార్థపూరిత మానవమనస్తత్వానికి, కనబడుతుంది. భూమండల ఆక్రమణతో తృప్తిపడని మానవ మహాచక్రవర్తుల దురాశకు, దురహంకారానికి అధికార దర్పానికి శాస్త్రాలు, ప్రజాస్వామ్యం, కవులు-పురోహిత వర్గం, రాజకీయాలు దాసోహమైన ఒక దుఃస్థితిని దాని దుష్పరిణామాలను వస్తువుగా చేసి వ్రాసిన నాటకం ఇది. మానవుడి దురాశ కారణంగా విధ్వంసానికి గురవుతున్న పంచభూతాలు . అంటే ప్రకృతి పర్యావరణ హింసను తట్టుకోలేక మానవుడ్ని అంత మొందించాలనుకొని కూడా మానవుల్లోని మారే లక్షణం మీద ఒక ఆరిపోని ఆశతో - బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలనుకొనటంతో, అందుకొరకై చర్చలకు అతనిని పిలవనంపటానికి 'వేదాంతి'ని రాయబారిగా పంపటంతో ఈ నాటకం ప్రారంభమవుతుంది. వేదాంతి అంటే లౌకిక జీవిత మోహాలు, వ్యామోహాలు లేనివాడు. వేదాంతిని రాజ్యాధికారం పక్షాన నిలబడిన శాస్త్రజ్ఞుడికి తమ్ముడుగా చేసి శేషేంద్ర ఈ నాటకంలో రక్త సంబంధాల కన్న వర్గసంబంధాలు, ప్రయోజనాల ప్రాధాన్యతలు మానవ సంబంధాలలో ఎంత బలీయంగా పనిచేస్తున్నాయో సూచించారు. ప్రజాస్వామ్యం కూడా ఈ నాటకంలో ఒక పాత్ర. రాజ్యంచేత, అధికార వర్గం చేత అది ఎప్పుడూ తిరస్కరించబడుతూనే వుంటుంది. తేలికపరచబడుతూనే వుంటుంది. అధికార వర్గ ప్రయోజనాలకు, నా అనే స్వార్థాన్ని సమర్థించి సంరక్షించటానికి ఏర్పడిన చట్టాలకు వాటి నగ్నత్వం, క్రూరత్వం ప్రజలకు కనబడకుండా చేసే ఒక రక్షణ కవచంగా మాత్రమే అది ఉపయోగపడుతున్న స్థితిని శేషేంద్ర గుర్తించి ఈ నాటకేతి వృత్తంలో భాగం చేశారు. ప్రజాస్వామ్యం అద్దాల బీరువాలో వుంచబడిన సువర్ణాక్షరాల బైండు పుస్తకం అని చెప్పిన శేషేంద్ర దేశీయ ప్రజాస్వామ్యం నోరులేని, నోరు మూసుకొని పడి వుండాల్సిన జీవి స్థాయికి దిగి జార్చబడటాన్ని ఈ నాటకం స్పష్టం చేసింది.

స్వాతంత్య్రం ఒక మేడిపండు అని తెలిసి దానిని సాంస్కృతిక రంగంలో తీవ్ర స్వరంతో నిరసిస్తున్న దిగంబర కవిత్వోద్యమానికి, రాజకీయార్థికరంగంలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరిస్తున్న నక్సల్బరి విప్లవోద్యమానికి వేగుచుక్కగా వచ్చిన నాటకంగా మబ్బుల్లో దర్బారుకు ఒక ప్రాధాన్యత వుంది. కవులు ప్రభుత్వాధికారుల పక్షాన చేరి వారి సన్మానాలకు అశపడుతూ వారిని ఇంద్రులుగా చంద్రులుగా పొగుడుతూ పబ్బం గడుపుకొంటున్న తీరును గురించిన శేషేంద్ర ఆగ్రహం కూడా ఈ నాటకంలో భాగమైంది. ఇక్కడే తరువాతి కాలంలో శేషేంద్ర బలంగా నమ్మి ప్రచారం చేసి వైజ్ఞానిక నాయకత్వం భావనకు ప్రాతిపదికలు వున్నాయి. వేదాంతి చేత మానవమహాచక్రవర్తికి 'కవులూ, కళాకారులేరా నీకు వెలుగుబాటులు; నీ పురోగమనానికి నిదర్శనాలు'-అన్నమాటలు గమనించదగినవి.

1927లో పుట్టిన శేషేంద్ర శర్మ తన ఇరవయ్యవ ఏళ్ళ వయసునాటికే కవిత్వం ప్రౌఢంగా చెప్పటాన్ని బాగా అభ్యాసం చేశారు. 1947 నుండి అప్పుడప్పుడు చెప్పిన పద్యాల కూర్పుగా 1961లో చంపూవినోదిని వెలువడటంతో శేషేంద్ర కవిగా తెలుగు సాహిత్యరంగ ప్రవేశం చేశారు. 1962లో 'ఋతుఘోష' కావ్యప్రచురణ చేసి కవిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. అక్కడి నుండి ఆయన కవితాజైత్రయాత్ర సందడిగా సంవాదాలతో సంరంభంగా సాగింది. 'యుగద్రష్ట'గా ఆయనకొక పేరు తెచ్చిపెట్టింది. కవిగా శేషేంద్రను రెండుకోణాల నుండి చూడాలి. ప్రాథమికంగా కవిత్వమంటే శేషేంద్ర దృష్టిలో ఆశ్చర్యం కలిగించే చమత్కార అభివ్యక్తి. వాల్మీకి తదితరుల కవిత్వ విశేష గుణగణ గానం చేసేటప్పుడు కూడా శేషేంద్రం తరచూ దీనికే ప్రాధాన్యమిచ్చారు. అందువల్ల తను కూడా అహా అనిపించేలా కవిత్వం వ్రాయటం పైననే దృష్టి పెట్టిన కవి శేషేంద్ర. 'గజల్' ప్రక్రియ శేషేంద్రకు ఇష్టం కావటం కూడా ఈ జీవలక్షణం వల్లనే. కనుక శేషేంద్ర కవిత్వాన్ని అభివ్యక్తి రామణీయత దృష్ట్యా పరిశీలించటం, ఆహా పుట్టించేట్లు కవిత్వం చెప్పటానికి ఆయన ఉపయోగించుకొన్న సాహిత్య మూలకాలను గుర్తించటం ఒక పద్ధతి. సౌందర్యం, చమత్కారం చూపించటానికి కవి కృషి చెయ్యాలన్నది శేషేంద్ర పిలుపు. అయితే అలా చెప్పటానికి ఏదో ఒక భావం అవసరం అని శేషేంద్రకు తెలుసు. శేషేంద్ర ఏ భావాలను తన కవిత్వంలో పలికించాడో పరిశీలించటం మరొక కోణం. ఆనుషంగికంగానే అయినా కవి ఏ సామాజిక సంవేదనను ఏ మేరకు తన కవిత్వంలో ప్రతి ఫలించాడో పరిశీలించాలి.

కవిత్వరచనాభ్యాసకాలంలో శేషేంద్ర ప్రతి జీవిత సందర్భాన్ని కవితా వస్తువు చేసుకొన్నారు. అప్పుడప్పుడు చెప్పిన విడివిడి పద్యాలను అలాగే అచ్చు వేస్తే చాటువులు. వాటికి సందర్భాన్ని హాస్య వ్యంగ్య చమత్కార పద్ధతిలో వచనంలో ఇస్తూ వ్యాఖ్యానిస్తూ కూర్చారు కనుక 'చంపూ వినోదిని' అయింది ఆపుస్తకం. తాను వినోదంగా వ్రాశారు. చదివేవారికి వినోదం కలిగించటం ఉద్దేశించారు. ఇందులో స్త్రీలను ఉద్దేశించి స్త్రీలను వర్ణిస్తూ వ్రాసిన శృంగార ప్రధాన పద్యాలూ వున్నాయి. కాఫీ హొటలు పరిసరాలను వర్ణించే పద్యాలూ వున్నాయి. ఆశువుగా చెప్పిన సరదా పద్యాలున్నాయి. అధికార దుర్మదాంధులను విమర్శిస్తూ వ్రాసిన తిట్టూ కవిత్వమూ వుంది. చూడండి.

లక్షాతొంబయి కుంభకోణములు నిర్లక్ష్యంబుగా సల్పుచున్.

 

 

కుక్షిన్ నింపెడు కుంభకర్ణులును భూగోళంబు గోళంబుగా

 

 

భక్షింపంగల బ్రహ్మ రాక్షసులు శుంభద్గండ భేరుండముల్

 

 

పక్షీంద్రుల్ తమ జీర్ణ శక్తి కివిగో బాబూ నమస్కారముల్....

 

 

                * * * *

ఓరోరీ! అధికార దుర్మద వితండోద్ధండ చండాలుడా

 

 

నీరాజత్వము నీనిరంకుశ దశన్ నీ గర్వ సర్వస్వమున్

 

 

 నీరేఖాలవమేని నిల్పక నినున్ నిర్మూలముంజేసి ని

 

 

స్సారుంజేయు దినంబు వచ్చె నికపై చాలింపు నీవేషముల్.

 

 

ఆఫీసర్లదీ రాజకీయ నాయకులదీ ఒకే లక్షణం, ఒకే తత్త్వం, ఒకే దృక్పథమూ అని 1954 నాటికే స్పష్టంగా తెలుసు శేషేంద్రకు. ధనిక వర్గం వాళ్ళకు వెన్నెముకగా వుందని కూడా తెలుసు. వాళ్ళమీద తన ధర్మాగ్రహాన్ని కవి వ్యక్తం చేశారు కవిత్వం మాధ్యమంగా.

అప్రయోజకులైన యీ ప్రజానీకంబు

 

 

ఘనతర క్షీరసాగరము గాగ

 

 

 ఎల్లదిక్కుల తాండవించు నజ్ఞానంబు

 

 

బలమైన మందరాచలముగాగ

 

 

 జాజ్జ్వల్వమాన ప్రజాస్వామ్య సూత్రంబు

 

 

త్రాడైన భుజగాధిరాజు గాగ

 

 

మహిత కోపాటోప మదమత్సరంబులు

 

 

 గగనమంటెడు తరంగములుగాగ

 

 

చటుల కలికాల రాక్షసజాతులైన

 

 

 రాజకీయులునుద్యోగు లాజివోలె

 

 

 ఉభయ పార్శంబులంజేరి యుగ్రధాటి

 

 

చిలుకు చున్నారలధికార సిద్ధి కొరకు -”

 

 

ఇలాంటి సామాజిక విమర్శనాత్మక పద్యాలు చంపూ వినోదినిలో వున్నాయి. ఇది చెప్పట మెందుకంటే శేషేంద్ర ప్రారంభ కవిత్వం సంప్రదాయ ప్రాబంధిక పద్య నిర్మాణ వారసత్వం నుండి రూపు తీసుకొన్నదనీ, విషయం, భాష రెండూ ఇందులో ప్రధానంగా వున్నాయని చెప్పటానికి. ఋతుఘోష దానికి కొనసాగింపు. పద్య రచన శ్రీనాథాధి పూర్వ కవుల ప్రభావంతో సాగటం, ఉత్పల సత్యనారాయణచార్యులు గారన్నట్లు పదాలతో పాఠకులను మోహింప చేయటం, ఇందులో ప్రధానం. విశ్వనాథసత్యనారాయణ గారు గుర్తించి చెప్పిన విశేషం - ఋతువులలో బాహ్యవిలాసం, మానవ మనోప్రవృత్తుల మీద వాటి ప్రభావం, మానవుల సామాజికార్థిక వైయక్తిక పరిస్థితులలోని ప్రత్యేకత మూలంగా ఆ ప్రభావాలలోని వైవిధ్యం, విషాదం ఈ కావ్యంలో ప్రతి ఫలించటం -ఏది ఏమైనా భావుకత ఇందులో కేంద్రాంశం. భావకవిత్వాన్ని ముప్ఫైఏళ్ళ తరువాత పునరుజ్జీవింప చేసే పనికి పూనుకొని వ్రాసిన కావ్యంగా ఇది కనిపిస్తుంది.

చిక్కని చిగురాకు జీబులో పవళించి

యెండువేణువు కంఠమెత్తిపాడె తలిరాకులూడిచి తపసిగా మసలిన

నగ్నవల్లికయు పర్ణములదాగె జిలుగు సీతాకోకచిలుకరూపము దాల్చి కీటకయోగి కంకేళి గవిసె

శిశిర వ్రతాచార జీర్ణమారుతమూర్తి యలరు గిన్నెల గంధమలదు కొనియె

ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ యెడద పురుషునిలో మొగ్గదొడిగెనేమొ విశ్వమందిర కుడ్యముల్ విరుగగొట్టి మోహకల్లోల వీచిక ముంచివ

1 Comment

  • ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ యెడద పురుషునిలో మొగ్గదొడిగెనేమొ విశ్వమందిర కుడ్యముల్ విరుగగొట్టి మోహకల్లోల వీచిక ముంచివైచె- ఇలా సాగిపోతాయి పద్యాలు. ఋతు శోభను వర్ణిస్తూ చెట్లు, చిగురాకులు, పక్షులు, పాటలు తనలో కలిగించే భావస్పందనను చెప్తూ చెప్తూ తటాలున కవి శ్రామిక జనం వైపు దృష్టి మళ్లించటం ఋతుఘోషలో కనిపిస్తుంది. "తోరపు పంటచేలు పువు దోటలు బాటలు పచ్చబీళ్ళు పొం గారు తటాకముల్ తనవి గావు,” అని సంపదకు పరాయీకరింపబడిన శ్రామికుల గురించి మాట్లాడతాడు. శ్రామికుల దైన్యం కవిని వేధిస్తుంది. చాకళ్ళు మొదలైన వృత్తి పనివాళ్ళు, రిక్షాకూలీలు, బండలులాగే అభాగ్యులు ఆరకంగానే శేషేంద్ర కవిత్వంలోకి ప్రవేశించారు. ఆక్రమంలోనే “ఓ పరమేశ్వరా! యెచట నుంటివి నీ వసలుంటివే ప్రజా శాపములం భరించుటకు సాధ్యముగాదని పాత పెత్తనం బీపయి సాగబోదని యెని పరారయినావ? బాధలం బాపగలేవు నీవు శిలవా కలవా సెలవీయుమో ప్రభూ అని దేవుణ్ణి నిలదీస్తాడు కూడా. 'పక్షులు' కవితాసంకలనం వచ్చింది 1970లో. అయినా ఇందులోని పద్యాలు 1950 ల నుండి వ్రాసినవి. చమత్కార వైభవ అభివ్యక్తి ప్రాధాన్యత ఈ కవితలో కనబడుతుంది. ప్రధానంగా ఇవి ప్రేమ కవితలు. వలపుల వలలో రంగుల చేపగా చిక్కని వాడు, కలల కల్హారమాల మెడలో దాల్చనివాడు, “ప్రపంచవిపంచి తీగల రాగాలకు కన్నీ రొలకని వాడు, కవిత కడగంటి చూపుల కలిమికి నోచుకోలేడు అని ప్రకటించాడు. ఊహకు రెక్క లిచ్చి ఉదధులు దాటే పనిలో పడ్డాడు. కవికి సహజమైనవే అయినా ప్రకృతి పరిశీలన, తాదాత్మ్యం ఎక్కువయ్యాయి. పక్షుల సంగీతానికి పరవశించే హృదయ సౌకుమార్యం అభివృద్ధి చెందింది. పూలతో మాట్లాడటం, పక్షుల చూపుల ఆహ్వానానికి పరవశించటం, తోటల విహారానికి ఉత్సహించటం ఇవి ఈ కవిత్వంలో కనిపించే అంశాలు - భావకవిత్వ సరళిలో సాగిన పద్యకవిత్వం ఇది. ఈ విధమైన వ్యక్తి అనుభవ తీవ్రతా కేంద్రంగా కవితలలో వ్రాస్తూనే మళ్లీ ఆకలితో ప్రాణాలొదిలే శిశువులు, పశువుల వలె శ్రమచేసే మనుషులు వున్న లోకాన్ని చూచి అసలీ లోకము లోకమా! విషభుజం గానీక వల్మీకమా' అని గర్జిస్తాడు కూడా కవి. రండి అభాగ్యులార బధిరాంధక పీడితులార రండి యీ పండిన చేలు పల్లెలును పట్టణముల్ గిరి నిర్ఝరాది భూ మండలమెల్ల మీయది యమాయక శృంఖల ద్రెంచి వైచి యా ఖండల మూర్తి దాల్చుడు - అని పిలుపునూ ఇస్తాడు. అమాయక శృంఖల త్రెంచటమంటే సృష్టించిన సంపదలకు సృష్టి కర్తలే పరాయీ కరింపబడటంలోని మాయను తెలుసుకోవటం. అప్పుడే పండినచేలు, పల్లెలు తమదేనన్న విశ్వాసం కలుగుతుంది. విముక్తికి అదే ప్రారంభం. కులగోత్రమ్ములు లేవు మాకు, ధనిక క్రూర క్రియా పీడిత జ్వలిత ప్రాణిచమూసమూహమొకటే సత్యంబు, ఊహాభుజా ర్గళముల్ విప్పిన విశ్వమూర్తి యయి శంఖారావముం జేయుడో దళిత శ్రామిక జీవులార! భువన ద్వారంబు భేదిల్లగన్ - అని ధనికస్వామ్యపు దాస్యంలో మగ్గే అభాగ్యులకు కర్తవ్యోపదేశం చేస్తాడు. “శేషజ్యోత్స” శేషేంద్ర అనుభూతి తీవ్రతకు ప్రాతినిధ్యంవహించే సంకలనం. శేషేంద్ర చెప్పినట్లు ఇంద్రియాలు నేర్పే సుఖ దుఃఖ రూపక వేదనామయ జీవితానుభూతుల వ్యక్తీకరణమిది. అయితే చంపూ వినోదిని నుండి పక్షులు వరకు శేషేంద్ర తొలిదశ కవిత్వంలో కనబడిన అధికార వ్యతిరేకత, పెత్తందారీ వ్యతిరేకత, శ్రామిక జన పక్షపాతం మలిదశలో 'మండేసూర్యుడు' దగ్గర నుండి ప్రారంభించి మరింత స్పష్టతను, సమగ్రతను, తీసుకొన్నది. నక్సల్బరి విప్లవోద్యమ వర్తమానం శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటమైన సందర్భం నుండి శేషేంద్ర కావ్యవస్తువు కర్షక జీవితమైంది. కావ్యనాయకుడు కర్షకుడైనాడు. 1974లో 'మండేసూర్యుడు'గా వ్రాయటం వెనుక ఈనేపథ్యం వుంది కనుకనే కవి తనను చెమట బిందువు (మండేసూర్యుడు)గా చెప్పుకొనటం అంత సహజంగా జరిగిపోయింది. ఈ కావ్యంలో ఆద్యంతాలు సూర్యుడు ఒక ఉపమ, ఒక ప్రతీక. భిన్న సందర్భాలలో, భిన్న భావోద్వేగాల కలయికతో సూర్యుడి గురించిన భిన్న భిన్న భావనలను రూపు కట్టించాడు శేషేంద్ర, శేషేంద్ర భావ ప్రపంచంలో సూర్యుడు పాట, సూర్యుడు సందేశకర్త, సూర్యుడు ఆహ్వానించవలసిన శక్తి, శ్రామికుడే సూర్యుడ్ని జయించినవాడుకూడా, సూర్యుడు కొత్త సృష్టికి సంకేతం, రేపటి ఆశకు ఆలంబనం-ఇలా సూర్యుడు-శ్రామికుడు ఈ ఇద్దరిని చుట్టుకొని తనను కూడా కలుపుకొన్న కవి కారయిత్రీ శక్తి సౌందర్యం 'మండేసూర్యుడు' కావ్యాన్ని కాంతిమంతం చేసింది. 'వెళ్ళిన పక్షుల గుంపులు వెనక్కిరాలేదని ఆక్రోశిస్తున్న అడవులు'” చెట్లకు వ్రేలాడిన శిరసులు పూస్తున్నాయ్ కొమ్మల్లో పూలై గోలీదూరిన గుండెలు కదులుతున్నయ్ గుడిలో ఘంటలై వంటి పాదాలు (మండే సూర్యుడు) విప్లవోద్యమంపై అణచివేతను, దానిని ధిక్కరించి నిలబడుతున్న ప్రజాచైతన్యశక్తిని ధ్వనిస్తాయి. “కష్టాల అగ్నుల్లో నించి ఖడ్గాలై పుట్టండి" అని అచేతనంగా వున్న జనంలో చైతన్య శక్తిని వూదటం, “నాగలిభుజాన వేసుకుని ఆకలి సంపాదించుకున్నవాడే -ఆకలి తీర్చుకునే హక్కును కూడా సంపాదించుకున్నవాడు. అని రైతుకు హక్కుల చైతన్యాన్ని కలిగించటం. 'నేనే మీరస్తానై కలలు కంటున్నాను' అని రైతులకు అనివార్యమైన విప్లవమార్గంతో తనకు రూపకం చేసుకొనటం విప్లవోద్యమబావుటాగా తన బాసట శ్రామికుల కుంటుందని వాగ్దానం చేయటం (ఈగలు) దోపిడి పీడనల (పిలిచేరోడ్సు) పట్ల ప్రతి చర్యను అపేక్షించటం (ఆకలి) వచ్చే తరాలకోసం చచ్చే వీరులను మరణాలు మహాప్రబంధంగా ప్రతిధ్వనించే రస్తాలను (నారస్తా) కీర్తించటం ఉత్పత్తి సాధనమైన నాగలిని ఆరాధించటం (మండేగీత) మొదలైనవన్నీ 'మండేసూర్యుడు' కావ్యాన్ని నిస్సందేహంగా విప్లవకావ్యంగా నిరూపించేవే. ఎనిమిది సర్గల ఆధునిక ఇతిహాసం 'నాదేశం - నా ప్రజలు’ (1975) కూడా ఈ వరుసలోదే. శ్రామికులకు ఏమీ మిగల్చని దేశం గురించి, పీడనకు దోపిడికి గురయ్యే శ్రామికుల గురించి, శ్రామికులను దోపిడిని ద్వేషించే మనుషులుగా దోపిడిపై పోట్లాడే మనుషులుగా మార్చటానికి సంకల్పించిన కవి కోణం నుండి వ్రాసిన వచన పద్యరచన ఇది. చెట్టు ప్రధాన ప్రతీక. "పీడిత ప్రజలకే ఈ భూమి సంక్రమిస్తుంది...రండి నాతో ప్రజలారా ! మీ నాగళ్ళు భుజాన వేసుకు రండి" (6సర్గ) అని పిలుపు నిస్తాడు కవి. "నా నాయకత్వం నాదే, దాన్ని రాజకీయాల బారికి అప్పగించను' ' (6) అని చెప్పిన కవి తన నాయకత్వంలో ప్రజలు నడవాలని ఆశిస్తాడు. రైతులనే కాదు, విద్యార్థులనూ సంబోధిస్తాడు. గొర్రెల్లా (1976) లోను కవి బోధకుడే. సాయుధ విప్లవాన్ని గొర్రెల్లాగా సంభావంచి, రైతు కండరాల్లో నిద్రిస్తున్న గొర్రిల్లాను లేపటానికి కవిచేసిన బోధన ఇది. 'జెండా' ఇందులో ప్రముఖంగా వాడబడిన ప్రతీక. ప్రభుత్వ ఉద్యోగవ్యవస్థలోని ప్రజావ్యతిరేక స్వభావాన్ని కూడా విమర్శకు పెట్టాడు-“మీ చేతులే మీ స్వర్గం నిర్మించే శక్తి పొందాలనీ, మీ గుండెలు ధైర్యపు కండలు తొడుక్కోవాలనీ 'మీ దేహాల్లో గొర్రిల్లా మీ మస్తిష్క శిఖరాలకు పెరగాలనీ' ఆశీర్వదిస్తున్నాను, - పదండి” అని అందరినీ ఉద్బోధించాడు. 1983లో 'ఆద్మీ' కావ్యంలోనూ కవి విప్లవాన్నే సంభావించాడు. అరుస్తున్న ఆద్మీ, గోడల మీద రాస్తున్న కుర్రవాడు, ఉరికంబాన ఊగుతున్న వీరుడు మొదలైన వాళ్ళను పటం కట్టి చూపాడు. వర్గ చేతనను కనబరిచాడు. విప్లవానికి పరిస్థితులు పరిపక్వమై వున్నాయని "నిండు కంఠము విప్పరా - సోదరా, నిదురలెమ్మని చెప్పరా” అంటూ ప్రబోధకులకే ప్రబోధకుడైనాడు. జెండాను భావనాత్మకంగా అనేక సందర్భాలలో అనేకసార్లు అనేక చాయలతో ఎగురవేయటం సుత్తి, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లను అలంకారాలు చేయటం ఇందులో కనిపిస్తుంది. ఆ రకంగా చూచినప్పుడు శేషేంద్ర కవిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ప్రభుత్వాధికార వ్యవస్థను ధనస్వామ్యాన్ని, దోపిడిని వ్యతిరేకిస్తూనే వచ్చాడు. శ్రామికుల పట్ల సానుభూతి చూపాడు. విప్లవమే విముక్తి మార్గమన్న అవగాహన కనబరిచాడు. 1970 నుండి 80 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉవ్వెత్తున లేచిపడ్డ విప్ల వోద్యమాల చలన చైతన్యాలు తన కవిత్వానికి నేపథ్యం చేసుకొన్నాడు. తన భావుకశక్తినంతా దానిపై కేంద్రీకరించాడు. 'విప్లవభాషావిధాత' గా కీర్తి గడించాడు. సహజంగా లోకంలోని అన్యాయాలకు, అక్రమాలకు దుఃఖించే వాళ్ళే కవులు. దానికి తోడు శేషేంద్ర శర్మ బాల్యం నుండే అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ తాత్త్వికతతో పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీ ప్రభావానికి లోనయ్యాడు. ఋతుఘోష, పక్షులు మొదలైన సంకలనాల నిండా లెఫ్టిస్టు పొయట్రీ వుందని చెప్పగలిగిన ఆత్మవిశ్వాసం ఆయనది. తన కవిత్వతాత్త్విక భూమిక అదేనంటాడు. శాశ్వతంగా నాలో స్పందించే ఏకారా కమ్యూనిజం అని 1988లో అఫ్సర్కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు. 1991 నాటి మరొక ఇంటర్యూలో నక్సలిజం వైపు మొగ్గు చూపాడు. కానీ చిత్రంగా భావ అనుభూతి వాద కవులు స్వంతం చేసుకొని శేషేంద్ర వైజ్ఞానిక నాయకత్వాన్ని అంగీకరించారు. ఆయన చెప్పిన విప్లవం, విప్లవ కర పరిస్థితులు, శక్తులు ఇవేవీ వాళ్ళకు పట్టలేదు. విప్లవభావనను భావుకసీమలో ప్రదర్శించిన శేషేంద్ర చమత్కార వైభవానికి పరవశించి పోయారు. ఏమిచెప్పాడన్నది పక్కకు పెట్టి ఎలా చెప్పాడన్నదానినే వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ కొనియాడారు. శేషేంద్ర ఈ కవిత్వం వ్రాసిన 70వ దశకం తెలుగులో విప్లవసాహిత్య ఉద్యమదశకం. విప్లవ రచయితల సంఘనిర్మాణం కూడా జరిగింది. కానీ విరసం శేషేంద్రను తమవాడిగా స్వీకరించలేదు. ఈ వైరుధ్యాలకు కారణాలను వెతికే దిశగా శేషేంద్ర సాహిత్యంపై అధ్యయనాలు ప్రారంభించాల్సివుంది. శేషేంద్ర సృజన రచయిత మాత్రమే కాదు. విమర్శకుడు కూడా. విమర్శించే కావ్యంలో విమర్శకులు పరిశీలించాల్సిన అంశాలు ఆయన దృష్టిలో మూడు. ఒకటి అలంకారం, రెండు భాష, మూడు వస్తువు. మూడూ మూల ద్రవ్యాలే అయినా వీటిలో సృష్టి అనదగినది మాత్రం అలంకారమేనంటాడు. అలంకార సృష్టి క్రమంలో భాష కూడా మార్పు చెందుతుందని చెబుతాడు. ఈ విమర్శ సూత్రాన్ని శేషేంద్ర ఆయన కవిత్వం ప్రధానంగా అలంకారమయం ఉపమను ప్రతీక స్థాయికి ఎదిగించి కవిత్వాన్ని జండాగా ఎగరేశాడాయన. ఆ క్రమంలోనే తంగిరాల సుబ్బారావు మొదలైన వాళ్లు చెప్పినట్లు నూతన భాషను సృష్టించాడు. వస్తువు దాని ఔగాములు, సంబద్ధతా సంబద్ధలు, సందర్భాలు, విప్లవోద్యమ గమనంతో, తాత్వికతతో వున్న సంవాదం పూర్తిగా అప్రధానం అయిపోయాయి. వాటి మీద జరగవలసిన చర్చ, విశ్లేషణ జరిగితేనే కానీ శేషేంద్ర కమ్యూనిజాన్ని ఎలా అర్థం చేసుకొన్నాడు ఏమేరకు స్వీకరించాడు అనే విషయాలు తేలవు. కవిత్వానికీ గీటురాయి అనుభూతి అన్నది శేషేంద్ర నిశ్చితాభిప్రాయం. జీవితంలో అనేక అనుభూతులుంటాయి. స్వానుభూతి కావచ్చు, సహానుభూతి కావచ్చు. అలాంటి అనేకానేక అనుభూతులలో విప్లవం కూడా ఒక అనుభూతి. దానితోపాటు ప్రేమ మొదలైన అనుభూతులు వుంటాయి అంటాడాయన. ఎప్పుడు ఏది అనుభూతికి వస్తే అప్పుడది కవితాంశం అవుతుంది. అయితే విప్లవం ఒక అనుభూతి వస్తువు మాత్రమేనా? సామాజిక వాస్తవికత, సిద్ధాంతం, ఆచరణ, వ్యూహం, పోరాటం వీటితో సంబంధంలేని అమూర్తాంశంగా దానిని చూడవచ్చునా ? అట్లా చూడడం వల్లనే కమ్యూనిజం నాలో స్పందించే ఏక్ తారా అని ఎంతగా చెప్పు కొన్నప్పటికి శేషేంద్ర విప్లవ కవిగా గుర్తింపును పొందలేకపోయాడా? - శేషేంద్ర కవిత్వాన్ని ఇప్పుడీ కోణం నుండి అధ్యయనం చేయాలి. శేషేంద్ర వ్రాసిన సాహిత్య విమర్శ రచనలను పరిశీలించినా ఆయన వ్యక్తిత్వంలోని వైచిత్రి అర్థమవుతుంది. సమకాలీన తెలుగు కవులను, విప్లవ కవిత్వాన్ని ఆయన పరిగణనలోకే తీసుకోలేదు. వర్గ చైతన్యాన్ని వ్యక్తిగత సంస్కారంగా చూచాడు. కనుకనే పోరాటాలు వ్యక్తిగతంగా ఏర్పడతాయని చెప్పాడు- విప్లవ కవిత్వము – సాహిత్య విమర్శ వంటి వ్యాసాలలో. ఇక ప్రధానంగా ఆయన విమర్శ సంస్కృత సాహిత్యంపైననే జరిగింది. హర్షనైషధాన్ని విమర్శించినా, వాల్మీకి రామయాణాన్ని విమర్శించినా వాటిని మంత్ర యోగ వేదాంత శాస్త్ర సంపుటులుగా ప్రతిపాదించాడు. శబ్ధార్థాలకు అతీతమైన చమత్కారాన్ని కావ్యం నుండి ఆస్వాదించటం, అనుభూతిచెందటం గురించే ఆయన వివరణలు విశ్లేషణలున్నాయి. గజల్ ప్రక్రియ ఆయనను అమితంగా ఆకర్షించిందీ అందువల్లనే. మొత్తంమీద ప్రవృత్తి చమత్కార రామణీయకము ఆదర్శం ఆకాంక్ష విప్లవం అయితే అది గుంటూరు శేషేంద్రశర్మ. రూపానికి సారానికి వున్న వైరుధ్యాన్ని సమన్వయించుకొనటంలో పరిష్కరించుకొనటంలో కవిగా, విమర్శకుడుగా శేషేంద్ర శర్మ సాధించిన విలువలేమిటో అంచనా వేయటానికి అధ్యయనం కొత్తగా ప్రారంభం కావాలిప్పుడు. ----------- ----------- * * * * * * * డా. కాత్యాయనీ విద్మహే 1955 నవంబర్ 3 న ప్రకాశం జిల్లా మైలవరం (అద్దంకి) గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, రామకోటి శాస్త్రి దంపతులకు జన్మించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు కీ.శే. కేతవరపు రామకోటి శాస్త్రి పెద్ద కూతురు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటి శాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోనే తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాత్యాయనీ పుట్టింది మైలవరంలోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా వరంగల్‌లోనే. ఆమె మొగిలిచెర్ల (గీసుకొండ) గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి మాదిరిగానే కాత్యాయని కూడా తెలుగు సాహిత్యం అభివృద్ధి చేయాలన్న దృక్పథం కలిగి ఉండేది. అందుకు అనుగుణంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి డిగ్రీ పొందారు. వారికి ఒక కూతురు ఉంది. 12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. ప్రాథమిక విద్య వరంగల్‌లోని సుజాతరెడ్డి హైస్కూల్‌లో, ఇంటర్ పింగిళి కళాశాల, డిగ్రీ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, ఎం.ఏ తెలుగు కేయూలో చదువుకున్నారు. ‘చివరకు మిగిలేది - మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు. --------------- ------------------- శేషేంద్ర శర్మ (20-10-1927 - 30-5-2007) సంస్మరణ ప్రముఖ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ (79) మే 30 రాత్రి మరణించారు. ఆయన 1927లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ పనిచేశారు. 'నా దేశం నా (ప్రజలు' ‘శేషజ్యోత్స్న’, ‘రక్తరేఖ', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'జనవంశం', “రుతుఘోషు', 'మండేసూర్యుడు', 'స్వర్ణహంస', 'రామాయణ రహస్యాలు' వంటి రచనలు చేశారు. 'కవిసేన మేనిఫెస్టో ఆయన సుప్రసిద్ధ రచన. ఆయన సాహిత్యకృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. కవిత్వం, సాహిత్య విమర్శ ఇతర వచన రచనలన్నీ కలిపి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి. ధన్జ్గరి సాహచర్యంతో రాణివాసానికి వెళ్ళి సాహిత్య సామ్రాట్గా మారినట్లు కనిపించినా, ఆయన చివరి దాకా ఎస్టాబ్లిష్మెంట్కు దూరంగానే ఉన్నారు. ఉద్యోగం తొలిరోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐ.వి. సాంబశివరావుతో కలిసి నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ఆయనను నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది. 1955 ఆంధ్రా ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీవైపు నిలబడిన శ్రీశ్రీ దాదాపు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇంక 1991 నుంచి గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర 'నీతులు చెప్పే అమెరికా ఇదీ నీ చరిత అని వ్యాస సంపుటివెలువరించారు. ఆయన మరణానికి "వీక్షణం” తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక జూలై 2007 --------- సహస్రాబ్ది దార్శనిక కవి కవిర్విశ్వో మహాతేజా గుంటూరు శేషేంద్ర శర్మ Visionary Poet of the Millennium http://seshendrasharma.weebly.com/ జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు తండ్రి సుబ్రహ్మణ్య శర్మ తల్లి అమ్మాయమ్మ భార్య / జానకి పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు) కవి విమర్శకుడు ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు . – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, (21 ఆగస్టు, 2000) “ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు. - పుస్తకం.నెట్ * * * పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొకశైలీనిర్మాత. – యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999 -----------

    Posted Thu, 9/10/26 3:41 AM by Saatyaki S/o Seshendra Sharma

Create Online Memorials and Immortalize Your Loved Ones.
If you are a member of this tribute, please log in to leave a comment.